'మనసు కోరితే... తగ్గేదే లే'.. అల్లు అర్జున్ జోమాటో యాడ్ చూశారా..?

  • IndiaGlitz, [Friday,February 04 2022]

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగులతో హోరెత్తుతోంది. ప్రతి ఒక్కరూ ‘‘తగ్గేదే లే’’ అంటూ మేనరిజమ్ చూపిస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీతో అల్లు అర్జున్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అలాగే ప్రముఖ కంపెనీలు సైతం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల కోసం బన్నీతో ఒప్పందాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. దీనిలో భాగంగా ఆహార సేవల సంస్థ జోమాటో కోసం అల్లు అర్జున్ ఓ యాడ్‌లో నటించారు.

బన్నీతో పాటు నటుడు సుబ్బరాజ్ కూడా నటించారు. సదరు వాణిజ్య ప్రకటనలో అల్లు అర్జున్.. సుబ్బరాజ్‌ను కొడితే... 'బన్నీ! నన్ను కొంచెం తొందరగా కింద పడేయావా?' అని అడుగుతారు. 'సౌత్ సినిమా కదా! ఎక్కువ సేపు ఎగరాలి' అంటూ బన్నీ బదులిస్తారు. 'గోంగూర మటన్ తినాలని ఉంది. కొండకు వచ్చేలోపు రెస్టారెంట్ మూసేస్తారు' అని సుబ్బరాజ్ అంటే... 'గోంగూర మటనేంటీ ? ఎప్పుడు ఏం కావాలన్నా జోమోటో ఉందిగా' అని అల్లు అర్జున్ ఆన్సర్ ఇస్తారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ చివర్లో 'మనసు కోరితే... తగ్గేదే లే' అని బన్నీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే 'పుష్ప' రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ నటించిన 'రాపిడో' యాడ్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ లో తెలంగాణ ఆర్టీసిని కించపరిచే సన్నివేశాలు, డైలాగ్ లు వున్నాయని వెంటనే వాటిని తొలగించాలని టీఎస్ఆర్టీసి ఎండీ సజ్జనార్ స్వయంగా బన్నీకి, రాపిడోకి నోటీసులు పంపించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ర్యాపిడో సంస్థ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇక .. సినిమాల విషయానికి వస్తే... త్వరలో 'పుష్ప' సీక్వెల్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా ఓ సినిమా కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి.