Akbaruddin vs Revanth: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య పవర్ వార్

  • IndiaGlitz, [Thursday,December 21 2023]

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. విద్యుత్‌పై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌కు నిధులు ఎలా తెస్తారు? మహాలక్ష్మి, గృహజ్యోతిపై క్లారిటీ ఇవ్వాలంటూ కోరారు. శ్వేతపత్రంలో అప్పులపై వివరాలు ఇచ్చారు కానీ హామీలు ఎలా నెరవేరుస్తారంటూ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గత పదేళ్ల పాలనలో తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌ అని కొనియాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొంపల్లి సత్యనాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అప్పులపై.. పాతబస్తీలో అభివృద్ధిపై మాట్లాడాలని కోరారు. దీంతో అక్బరుద్దీన్ సభలోకి కొత్తగా వచ్చిన పిల్లలు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి.. ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆరెస్సెస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానన్నారు. నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇలా అందరితో దోస్తీ చేశారని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చర్చిద్దామంటే సిద్ధమని మండిపడ్డారు.

అయితే రేవంత్ గురించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. సభా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని అక్బరుద్దీన్‌కు సూచించారు. మీలాగే ఇక్కడివారందరూ గెలిచి వచ్చారని వ్యాఖ్యానించారు. ఎవరి మీద పడితే వారి మీద ఎదురు దాడి చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తమను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదంటూ పేర్కొన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి హయాంలో తనను జైలుకు పంపారని మళ్లీ జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. అధికారంలో ఉన్నవారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముస్లిం ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. మొత్తానికి ఇరు పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.