'ఐతే 2.ఓ' మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకురాలు నందినీరెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నందినీ రెడ్డి మాట్లాడుతూ "ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్‌ వైపు కూడా చూడటంలేదు. తెలుగు ఆడియెన్స్‌లో చాలా మార్పొచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. రాజ్‌ మాదిరాజు అమేజింగ్‌ కథ రాశారు. ఆయన రచనాశైలి అంటే నాకు చాలా ఇష్టం. ఇది మంచి సినిమా అవుతుంది" అని అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ "ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమా ఇది. ఇలాంటి కథను ఎంచుకున్న దర్శకుణ్ణి మెచ్చుకోవాలి. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నా" అని అన్నారు.

దర్శకుడు రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ "ఇంజనీరింగ్‌ పూర్తి చేసి నిరుద్యోగంతో ఉన్న నలుగురు యువకులు ఆకలికీ, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు అన్న పాయింట్‌కు నేటి టెక్నాలజీ, సోషల్‌ మీడియా, హ్యాకింగ్‌ వంటి అంశాలను కీలకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ వలలో ఇరుక్కుపోయిన జనాలకు ఈ సినిమా ద్వారా చక్కని సందేశం ఇస్తూ ఓ హెచ్చరిక కూడా ఇస్తున్నాం. పూర్తిగా ప్రయోగాత్మక చిత్రమిది" అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ "యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చక్కని వినోదాన్ని కూడా పంచుతుంది. త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేసి మార్చి 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీధర్‌ నల్లమోతు, నీరజ్‌, జారా షా తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, ఎడిటింగ్‌: కార్తీక్‌ పల్లె, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్‌ చిలువేరు.