Varalaxmi Sarathkumar:డ్రగ్స్ కేసులో నోటీసులంటూ ప్రచారం .. నా ఫోటోతో వార్తలు , ఏం జరిగిందంటే : క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. అందాల ఆరబోతకైనా, పవర్ ఫుల్ యాక్టింగ్‌కైనా సై అంటారు వరలక్ష్మీ. తమిళంలో కంటే తెలుగులోనే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువంటే అతిశయోక్తి కాదు. క్రాక్, నాంది, వీరసింహారెడ్డి సినిమాలలో తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో తెలుగువారిని ఆకట్టుకున్నారు వరలక్ష్మీ. నెగిటివ్ రోల్స్ కానీ కథను మలుపుతిప్పే పాత్రలను పోషించడంలో తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నారు.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో పుకార్లు ఎక్కువ. అందులోనూ హీరోయిన్లను టార్గెట్ చేసి వున్నవి, లేనివి కల్చించే చెప్పేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా వుంటారు. ఈ క్రమంలోనే వరలక్ష్మీ శరత్ కుమార్‌పైనా పలుమార్లు రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఆమెకు డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

వరలక్ష్మీ, అవికాగోర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్ వెబ్ సిరీస్ ‘‘మాన్షన్ 24’’ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దీనిలో భాగంగా డ్రగ్స్ కేసు గురించి వరలక్ష్మీ ప్రస్తావించారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఆదిలింగం అనే ఆయన తన వద్ద ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పనిచేశాడని.. ఆదిలింగం తీసుకొచ్చిన నాలుగు సినిమాల్లో తాను నటించినట్లు వరలక్ష్మీ తెలిపారు. అంతకుమించి ఆయన పర్సనల్ లైఫ్ గురించి తనకు ఏమి తెలియదని ఆమె అన్నారు. కానీ తన ఫోటోను ఉపయోగించి వరలక్ష్మీ మేనేజర్‌కు నోటీసులు అని వార్తలు రాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.