తీవ్ర విషాదం.. నటి కవిత భర్త మృతి, కొడుకు మరణించిన 15 రోజుల్లోనే..

  • IndiaGlitz, [Wednesday,June 30 2021]

ఒక ప్రళయంలా వచ్చి ప్రజలపై పడ్డ కరోనా వైరస్ వేలాది కుటుంబాల్లో చీకటి నింపుతోంది. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇది ఎప్పుడు అంతం అవుతుందో అర్థం కానీ పరిస్థితి. సీనియర్ నటి కవిత అందరికి సుపరిచయమే.

దక్షణాది భాషలో కవిత వందలాది చిత్రాల్లో నటించారు. కరోనా వైరస్ ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీర్ణించుకోలేని శోకాన్ని మిగిల్చింది. జూన్ 15న కోవిడ్ వల్ల కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. ఈ సంఘటన జరిగి 15 రోజులు గడవక ముందే నేడు కవిత తన భర్తని కూడా కోల్పోయారు.

కోవిడ్ తో కవిత భర్త దశరథ రాజ్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఆయన చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. కవిత కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఊహకు అందని విషాదమే అని చెప్పాలి.

కవిత కొడుకు సంజయ్ రూప్, భర్త దశరథ్ ఇద్దరూ కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారీన పడ్డారు. 11 ఏళ్ల వయసులోనే కవిత నటిగా మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు ఈ తరం హీరోల చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.