తమిళ ‘ఎర్ర’ స్మగ్లర్లు వర్సెస్ కడప లోకల్ గ్యాంగ్.. నలుగురు సజీవ దహనం

  • IndiaGlitz, [Monday,November 02 2020]

తెల్లవారు జామున కడప జిల్లా ఎయిర్ పోర్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను సుమో ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా ఒకటి సుమోలో కడప నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తోంది. విషయం తెలుసుకున్న కడపకు చెందిన లోకల్ గ్యాంగ్ సినీ ఫక్కీలో చేజింగ్ మొదలు పెట్టారు. ఆ ఛేజింగ్ నుంచి తప్పించుకునే క్రమంలో టిప్పర్‌ను సుమో ఢీకొట్టింది. ఆ వెంటనే మరో కారు వచ్చి సుమోను ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది.

జిల్లాలోని తాడిపత్రి రహదారిపై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ డీజల్ ట్యాంక్‌ను అతి వేగంగా వచ్చి సుమో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంలోనే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్ని ప్రమాద సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. కాగా ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్ల పైలట్ కారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు కూడా తమిళనాడుకు చెందిన వారే అని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.