Voters in AP: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ నియోజకవర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్..

  • IndiaGlitz, [Thursday,May 02 2024]

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. సర్వీస్ ఓటర్లు 65,707గా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందని.. ఓటర్ల సంఖ్య 1,500 దాటితో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా 9 వేల కేసులు నమోదు చేశామని చెప్పారు. కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశామని అన్నారు. ఇందులో రూ.105 కోట్ల విలువైన నగలు, రూ.47 కోట్ల నగదు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 10,403 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మంది గాయపడ్డారన్నారు.

అలాగే రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకుల సిఫారసుల మేరకు పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు... ప్రకాశం జిల్లాలో ఒంగోలు... నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ... తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి... ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్... చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పలమనేరు... అన్నమయ్య జిల్లాలో పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తామని వెల్లడించారు.

ఇక జనసేన పార్టీ పోటీ చేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని స్పష్టంచేశారు. అదే విధంగా 21 అసెంబ్లీ నియోజకర్గాలు ఏ లోక్‌సభ స్థానాల పరిధిలోకి వస్తాయో.. అక్కడ కూడా గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించమని తెలిపారు. ఈ మేరకు పలు నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు గుర్తులు మార్చడం జరిగిందని ఆయన వివరించారు.