జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

  • IndiaGlitz, [Wednesday,November 15 2023]

జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిష్త్వాఢ్‌ నుంచి ప్రయాణికులతో కలిసి జమ్మూ వెళ్తున్న ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 36మంది మృతి చెందగా.. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్‌-కిష్త్వాఢ్‌ జాతీయ రహదారిపై ఈ పెను విషాదం సంభవించింది.

దాదాపు 55 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం కిష్త్వాఢ్‌ నుంచి బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌-అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే దాదాపు 300 అడుగుల లోయలో బస్సు జారిపడింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కిష్టావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని లోయలో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్ సేవలను కూడా ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.

ఈ బస్సు దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ అలాగే ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.