బాలరాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు.. ప్రధాని మోదీ భావోద్వేగం..

  • IndiaGlitz, [Monday,January 22 2024]

ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని ప్రధాని మోదీ తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జై సియా రామ్‌’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిని మోదీ.. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక నుంచి మన రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసం లేదని రామ మందిరంలోనే ఉంటాడని చెప్పారు. జనవరి 22, 2024 చరిత్రలో నిలిచిపోతుందని.. వెయ్యేళ్ల తర్వాత కూడా జనవరి 22 గురించి మాట్లాడుకుంటారని పేర్కొన్నారు.

అంతిమంగా న్యాయమే గెలిచింది..

త్రేతాయుగంలో శ్రీరాముడు 14 ఏళ్లు అయోధ్యకు దూరంగా ఉంటే.. ఇప్పుడు మళ్లీ అయోధ్యకు రావడానికి శతాబ్దాలు పట్టిందని భావోద్వేగంతో ప్రసంగించారు. గర్భగుడిలో రాముడిని ప్రాణప్రతిష్ట చేసిన సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందన్నారు. ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోందని.. రాత్రి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చిన తర్వాత రామాలయ నిర్మాణానికి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశామని గుర్తుచేశారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని.. కానీ చివరకు న్యాయమే గెలిచిందన్నారు.

రాముడు వివాదం కాదు.. ఓ సందేశం..

రామమందిరం విషయంలో కొంత మంది వ్యక్తుల ఆలోచనా ధోరణి మార్చుకోవాలని సూచించారు. శ్రీ రాముడు వివాదం కాదని ఓ సందేశమని చెప్పుకొచ్చారు. అయోధ్య రామాలయం శాంతి, సామరస్యానికి ప్రతీక అన్నారు. కోట్లాది మంది హిందూవుల రామమందిర కలను సాకారం చేసినందుకు ముఖ్యంగా న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు చెబుతానన్నారు. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించానని.. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని వివరించారు. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నట్లు వెల్లడించారు. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించానని మోదీ తెలిపారు.

దీక్ష విరమించిన మోదీ..

రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో 11రోజులుగా మోదీ చేస్తున్న దీక్ష ముగించారు. కన్నుల పండువగా నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగిసింది. దీంతో మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకులు గోవింద్ దేవ్‌ గిరి మహరాజ్‌ నుంచి పవిత్ర తీర్ధాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ తీర్థాన్ని చరణామృత్‌గా పిలుస్తారు. పాలతో తయారు చేసిన ఈ తీర్థాన్ని పూజాక్రతువులో వినియోగిస్తారు. కాగా అయోధ్యలో బాలరాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12వ తేదీన ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన కఠిన ఉపవాస దీక్ష కొనసాగించారు.